Friday, 22 February 2013

Serial Bomb Blasts At Dilsukhnagar


హైద్రాబాద్ లో వరుస పేలుళ్ళ తర్వాత పరిస్థితి ఇంతవరకూ....

  నిన్న  హైద్రాబాద్ దిల్ సుఖ్ నగర్ లో జరిగిన వరుస బాంబు పేలుళ్ళు యావద్భారతదేశాన్నే కుదిపేసింది.  నిత్యం రద్దీగా ఉండే స్థలం అవటం, అక్కడే బస్ స్టేషన్ ఉండటం, సాయంత్రం వేళ అందరూ షాపింగ్ చేసుకునే సమయం, అక్కడే ఉన్న సినిమా హాళ్ళు, ఇవన్నీ కాక విజయవాడ, మద్రాస్, విశాఖపట్నం వెళ్ళే రహదారి కావటంతో ఆ హఠాత్పరిణామం అక్కడి వారిని భయభ్రాంతులను చేసింది.  ఎవరు ఎటు పరిగెడుతున్నారో తెలియని పరిస్థితి.
blast-scene-7
blast-scene-4
blast-scene-1
blast-scene-2
blast-scene-5

blast-scene-3
నిఘాసంస్థవారు ముందునుంచే అప్రమత్తంగా ఉండమని, అఫ్జల్ గురు ఉరిశిక్ష అమలు జరిగిన తర్వాత హైద్రాబాద్ లక్ష్యంగా ఉగ్రవాద చర్యలుంటాయని ముందే హెచ్చరికలు చేసినా, జరగకూడనిదంతా జరిగిపోయింది.  అత్యవసరమైన పనుంటే తప్ప భారత్ కి వెళ్ళవద్దని, వీలయినంత వరకూ భారత్ లో పర్యటించకపోతేనే మంచిదని అమెరికావాసులను నిఘాసంస్థవారు ఈ మధ్యకాలంలో హెచ్చిరిస్తూనే ఉన్నారు.  దొంగదెబ్బతీసే పిరికి ఉగ్రవాద కార్యకలాపాలు ముందుగా తెలిసినా, వాటిని నిరోధించటం నిజానికి కష్టమైన పనే.  ఎంతమందినని ఆపి చూడగలరు, ఎంతసేపని తనిఖీలు చెయ్యగలరు.  అప్పటికీ నగరంలో విస్తృత స్థాయిలో తనిఖీలు జరుగుతూనేవున్నాయి. 
కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఢిల్లీ నుంచి పరిస్థితిని సమీక్షించటానికి వచ్చారు.  నిన్నటి నుంచీ ముఖ్యమంత్రి, హోం మంత్రి, ఇతర మంత్రులు, నాయకులు ఘటనా స్థలికి పోయి చూడటం, గాయపడి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించటం చేస్తూనేవున్నారు.   ఈ రోజు షిండే కూడా గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లతో కలిసి ఘటనా స్థలిని చూసి, అక్కడి నుండి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. 
shinde
leaders-1
leaders-2
ఇంతవరకూ 15 మంది మృతి చెందారు, ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది.  గాయపడ్డ వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.  క్షతగాత్రుల వివరాలు తెలియజేయటం కోసం కంట్రోల్ రూం ఏర్పాటయింది.  040-23261166, 27852333, 27852437 ఫోన్ నంబర్లకి ఫోన్ చేసి వివరాలను పొందవచ్చును.  ఎస్ ఐ ఏ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి.  దిల్ సుఖ్ నగర్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.  ఛాదర్ ఘాట్ నుంచి దిల్ సుఖ్ నగర్ వైపు పోయే వాహనాలను నల్గొండ చౌరస్తా నుంచి మళ్ళిస్తున్నారు. 
wounded-1
wounded-2

పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హైద్రాబాద్ వచ్చి పరిస్థితిని సమీక్షించబోతున్నారు.  జరిగిన విషాదం తెలియగానే పాదయాత్రను విరమించి హైద్రాబాద్ వస్తున్నానని, ఇలాంటి విపత్కర సమయంలో ఎవరినీ నిందించటం భావ్యం కాదని, కాకపోతే ప్రజల ప్రాణాలకు, ప్రజల ఆస్తులకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారాయన. 
ఈ ఘటనకు సూత్రధారి రియాజ్ భత్కల్ అని అనుమానిస్తున్నారు.  బెంగళూరులో జరిగిన వరుస పేళుళ్ళ అనంతరం 2012 ఆగస్టులో కేంద్రీయ నేర పరిశోదన సంస్థవారు 25 మంది మీద కేసులు నమోదు చేసారు.  ఆ ఉగ్రవాదులు ఆంధ్రప్రదేశ్ లో పలు నాయకుల మీద హత్యకు కుట్ర పన్నారని, అందులో భాజపా నేత కిషన్ రెడ్డి కూడా ఉన్నారని, ఉగ్రవాదుల తదుపరి కార్యకలాపాలు హైద్రాబాద్ లోనే నని తెలిసి, ఈ సమాచారాన్ని కేంద్ర హోమంత్రి సుశీల్ కుమార్ షిండేకి నోట్ పెట్టారు.  అది చూసిన షిండే గురువారం ఉదయమే రాష్ట్ర పోలీసులకు హెచ్చరికలు పంపారు.  అయినా మొద్దు నిద్ర పోతున్నారా అని పోలీసుల మీద విమర్శలు వస్తున్నాయి కానీ నగరంలోని రాకపోకలను పూర్తిగా నిలిపివేయలేరు కదా.  ఇప్పుడీ నేతల రాకతో చెయ్యవలసిన బందోబస్తుల వలన పోలీసులు కంటి మీద కునుకే ఉండదు. 
అరెస్ట్ కావలసిన 25 మందిలో 15 మందే పట్టుబడి మిగిలినవారు పరారీలో ఉండటం, వాళ్ళల్లో ఉగ్రవాద సంస్థలు లష్కరేతాయిబా, హుజి సంస్థలకు చెందినవారయి ఉండటం, వాళ్ళల్లో కరడుగట్టిన ఉగ్రవాది కర్ణాటక వాసి రియాజ్ భత్కల్ కూడా ఉండటంతో నిన్న జరిగిన బాంబు పేలుళ్ళ వెనక రియాజ్ హస్తముందనే అనుమానం వ్యక్తమౌతోంది. 
ఉగ్రవాద చర్యలకు నిరసనగా ఈ రోజు రాష్ట్రంలో బంద్ కి భాజపా విహెచ్ పి లు పిలుపునిచ్చాయి.  ప్రభుత్వ మెతక వైఖరి, చేతకాని తనమే ఈ ఘటనలకు కారణమని విమర్శించాయి.

No comments:

Post a Comment