పూర్వకాలం
ఒక కర్మాగారం యజమాని ఐడి లేకుండా లోపలికి పోతుంటే అడ్డగించిన సెక్యూరిటీ
సిబ్బంది విధినిర్వహణకు మెచ్చుకుని ఆ యజమాని ఆ తర్వాత అతన్ని అభినందించాడట.
కానీ, విధి నిర్వహణ కాదు ముందు మాకు గౌరవం ఇవ్వటం నేర్చుకోమంటున్నారు మన
పాలకులిప్పుడు.
మహారాష్ట్ర
శాసనసభలో పోలీస్ అధికారి సచిన్ సూర్యవంశీ మీద శాసన సభ్యులు చెయిజేసుకోవటం,
అతను ఆ దెబ్బలకు హాస్పిటల్ పాలవటం, దరిమిలా సంచలనాత్మకమైన శాసన సభ్యుల
అరెస్ట్ ల అనంతరం శాసన సభలో జరిగిన సంక్షోభానికి తెరదించుతూ, మహారాష్ట్ర
హోం మంత్రి ఆర్ఆర్ పాటిల్ సదరు పోలీస్ ఇన్ స్పెక్టర్ ని సస్పెండ్ చెయ్యటం
జరిగిందని శాసన సభలో ప్రకటించారు. ఈ విషయం మీద గత మూడు రోజులుగా శాసన సభలో
గందరగోళం ఏర్పడి సభ ముందుకు సాగకపోవటంతో శాసన సభ్యులు బెయిల్ మీద బయటకు
రావటం, పోలీస్ ఆఫీసర్ సస్పెండ్ అవటం జరిగింది.
తప్పు
ఎవరిదన్నది కాదిక్కడ. ఈ సంఘటన ఇలాంటి ఆచారానికి నాంది కాగూడదు.
భవిష్యత్తులో శాసన సభ్యుల గౌరవ భంగం జరగకూడదు. వాళ్ళు ఏం తప్పు చేసినా సరే
అన్నది పైకి అనని మాట. శాసన సభ్యులందరికీ లోపల దాగిన గుబులు, రేపు తమవంతు
వస్తే అన్న భయం, ప్రజాప్రతినిధులుగా తాము చెప్పిన మాటను పోలీసు శాఖ
వినవలసిందే గాని తమకు పాఠాలు చెప్పగూడదనే అధికార దర్పం, ఇవీ శాసన సభ్యుల
చేత సభలో గందరగోళాన్ని సృష్టించిన అంశాలు. ప్రజాప్రతినిధులకు కొన్ని
ప్రివిలేజెస్ ఉన్నమాట వాస్తవమే, అవి రాజ్యంగ బద్ధమే కాకుండా కర్రపెత్తనం
చేసే చట్టాన్ని అమలు పరచే శాఖ మీద కొరడా ఝళిపించటానికి కూడా పనిచేస్తుంది.
అంతా అవసరమే కానీ, శాసన సభలో ఏమీ చెయ్యకుండా ఉన్న పోలీస్ అధికారిని, అతను
బయట ఏదో చేసాడన్న నెపం మీద ఆగ్రహం వహించటమే కాక అతనిమీద కలియబడటం నాయకులకు
శోభనిస్తుందా. వాళ్ళ చేతనే దెబ్బలు తిన్న ఆ అధికారిని సస్పెండ్ చెయ్యటం వలన
రాజకీయ నాయకులు ఈ రోజు ఎటువంటి సంకేతాలిస్తున్నారు.
ఇప్పటికే
ప్రభుత్వ యంత్రాంగాన్నంతా తమ గుప్పిట్లో పెట్టుకుని వాళ్ళ చేత అక్రమాలు
చేయిస్తున్నారనే అపఖ్యాతి ఎలాగూ మోస్తున్నారు. ఇప్పుడు, తన విధి నిర్వహణలో
ఎదురుగా ఉన్నది ఎవరన్నది చూడకుండా ప్రవర్తించగూడదు, చట్టం అందరికీ సమానం
కాదు, చట్ట సభల్లోని సభ్యులు విశేష అధికారాలుంటాయి కాబట్టి, వరాలిచ్చినా,
కష్టాలు కలుగజేసినా అంతా వాడి ఇష్టం అని దేవుడి విషయంలో ఎలాగైతే అంటారో
అలాగే రాజకీయ నాయకుల విషయంలోనూ అనుకోవాలి అన్న సందేశమిస్తున్నారు. దానికి
వారి తోటి రాజకీయ నాయకులంతా కలిసికట్టుగా నిలబడి మద్దతుని ప్రకటించారు.
విధిలేక పాలకపక్షం కూడా డూ..డూ.. అంది.
పోయిన
సోమవారం నాడు వోర్లీకి చెందిన సచిన్ సూర్యవంశీ బాంద్రా వోర్లీ రోడ్ లో
అనుమతికి మించిన వేగంతో వెళ్తున్న శాసన సభ్యుడు క్షితిజ్ ఠాకుర్ వాహనాన్ని
ఆపి ఫైన్ వేయటం జరిగింది. అంతే మంగళవారం అతని మీద ఐదుగురు శాసన సభ్యులు
విరుచుకుపడ్డారు. బుధవారం నాడు ఆ అయిదుగురినీ సభాపతి సస్పెండ్ చెయ్యటం
జరిగింది.
శాసన
సభలో సభ్యుల ఆందోళనతో సీన్ రివర్స్ అయింది. సస్పెండ్ అయనవారి సస్పెన్షన్
రద్దయింది, అరెస్టై జైల్లో ఉన్నవారు బయటకు వచ్చారు, విధినిర్వహణ చేసి
అందుకు దెబ్బలు కూడా తిని హాస్పిటల్ లో పడ్డ పోలీస్ అధికారి సస్పెన్షన్ కి గురయ్యాడు.
ప్రజాప్రతినిధులు
గెలిస్తే ప్రజలు గెలిచినట్టని అనుకోగూడదు సుమా. ప్రజలు తప్పు చెయ్యగూడదు.
వాళ్ళకి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు ఏం చేసినా నడిచిపోతుంది. తప్పు
చేసిన ప్రజలు వాళ్ళవంతూ వీళ్ళ వంతూ కూడా కలిపి అనుభవిస్తారు. ఎందుకంటే,
చట్టాన్ని అమలు చేసే అధికారులకు వారికి కలిగిన గౌరవభంగాన్ని
వెళ్ళగక్కుకునేందుకో సందు కావాలి.
-శ్రీజ
No comments:
Post a Comment