రాష్ట్రముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
మజ్లిస్ పార్టీ ని కాంగ్రెస్ నుండి దూరం కొట్టిన విషయం తెలిసింది. గత
కొన్నేళ్ళుగా ఎంఐఎం పార్టీ హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీని గుత్తాధిపత్యంగా
ఏలుతున్న విషయం తెలిసిందే. దానికి చెక్ పెట్టడానికి కిరణ్ కుమార్ రెడ్డి
వ్యూహం రచించాడా ? 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి మజ్లిస్
పార్టీకి పోటీగా ఓ బలమైన అభ్యర్థిని దించబోతున్నాడా అంటే ప్రస్తుత
పరిస్థితులను చూస్తే అదే అనిపిస్తుంది. ఇటీవలే భారత మాజీ కెప్టెన్,
ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న అజహరుద్దీన్
ఢిల్లీలో ముఖ్యమంత్రి కిరణ్ కమార్ రెడ్డిని కలిశారు. అనంతరం మీడియాతో
మాట్లాడిన ఆయన తన సొంత రాష్ట్రం అయిన ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల పై ఆసక్తి
ఉందని, ఆంధ్రప్రదేశ్ రాజకీయల్లో ప్రవేశానికి సంబంధించి అధిష్ఠానం నిర్ణయమే
అంతిమమని పేర్కొన్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తి చూపుతున్న
అజహరుద్దీన్ను ఎంఐఎం అధినేత అసదుద్దీన్కు పోటీగా హైదరాబాద్ ఎంపీ సీటు
నుంచి బరిలోకి దింపితే ఎలా ఉంటుందనే అంశంపై కాంగ్రెస్ ఆలోచన
మొదలుపెట్టింది. వాస్తవానికి హైదరాబాద్ నుంచి అసద్కు పోటీగా దింపేందుకు
అర్హుడైన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతానికి ఎవరూ లేదు. దీంతో
అజహార్ ని దించితే గట్టి పోటీ ఉంటుందని కాంగ్రెస్ లోని కొన్ని వర్గాలు
అభిప్రాయ పడుతున్నాయి.
అయితే హైదరాబాద్ ఎంపీగా పోటీ చేయటానికి
అజహర్ అసక్తి చూపుతారా? లేదా అన్నది తేలాల్సి ఉంది. గతంలో మ్యాచ్ ఫిక్సింగ్
వివాదంలో పీకల్లోతు కూరుకుపోయిన అజహర్కు ఆ సమయంలో మజ్లిస్పార్టీ అండగా
నిలిచింది. అజహరుద్దీన్ హైదరాబాదు నుండి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయనే
వార్తలపై ఎంఐఎం నేత అసద్ స్పందించారు. తనపై పోటీ చేసే ఇతర పార్టీల
అభ్యర్థిని తాను ఎంపిక చేయనని, మనది ప్రజాస్వామ్య దేశమని, మన పైన ఎవరైనా
పోటీ చేసే హక్కుందన్నారు. ఏవరైనా ఎక్కడి నుండైనా పోటీ చేయవచ్చునని
చెప్పారు. అజహరుద్దీన్ హైదరాబాదు నుండి పోటీ చేసినా ఎలాంటి అభ్యంతరం
లేదన్నారు. ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే హైదరాబాద్ ఎంపీ
స్థానానికి ఆయన పోటీ చేస్తారా లేదా అన్న విషయం తేలాలంటే వేచిచూడాల్సిందే.
No comments:
Post a Comment