నిత్యం గోవిందనామ స్మరణలతో మారుమోగే శేషాచల గిరుల్లో ఈ నెల 27వతేది
నుండి మూడు రోజులపాటు జరుగనున్న నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో
తెలుగు వెలుగులు గుబాళించనున్నాయి. నిర్వాహకులు తయారు చేస్తున్న తెలుగు
వంటకాల రుచులు అతిథుల కడుపులు నింపనున్నాయి. తెలుగు మహాసభల ఏర్పాట్లను
చూసేందుకు నగర వాసులే కాకుండా రాష్టవ్య్రాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు, భాషాభిమానులు తరలి వచ్చారు. కాగా, నగరంలోని ప్రధాన వీధులన్నీ మామిడి తోరణాలు, అరటి గెలల బోదెలతో అలంకరించారు. దీంతో తెలుగు పండుగలన్నీ ఒకేరోజు వచ్చాయా అన్నంత అనుభూతిని కల్గిస్తోంది. శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలోని శ్రీ వెంకటేశ్వర ప్రాంగణం ఇందుకు సర్వం సిద్ధమైంది.
తెలుగు నేలపై 'తెలుగు' పండుగ జరగనుంది. 38
ఏళ్ల తరువాత రెండోసారి మన రాష్ట్రానికి ఈ అవకాశం వచ్చింది.. తర్జనభర్జనలు
పడి ఎలాగోలా తక్కువ సమయంలోనే తిరుపతిలో వైభవంగా ఏర్పాట్లు పూర్తి చేశారు..
నేటి నుంచి 29వ తేదీ వరకూ మూడు రోజుల
పాటు ఇక్కడ ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్నాయి. భారత ప్రథమ పౌరుడు
ప్రణబ్ముఖర్జీ మహాసభలను ప్రారంభించనున్నారు. ప్రపంచ తెలుగు మహాసభలను
ఎనిమిది ఆశయాలతో నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ సభల్లో 226 కార్యక్రమాలను నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. సాహితీ చర్చలు.. సంగీత, నాట్య
కళా ప్రదర్శనలు.. కళారూపాల కనువిందు ఈ మహాసభలకు ప్రత్యేక ఆకర్షణగా
నిలవనున్నాయి. మహాసభల నిర్వహణకోసం రాష్ట్ర ప్రభుత్వం ఆరు ప్రత్యేక
కమిటీలనూ, అతిథులకు ఆహ్వానం, వసతి ఏర్పాట్లు, భోజన సదుపాయాలూ, రవాణా సౌకర్యాలు, ఆరోగ్యం, పారిశుధ్యం, భద్రత
అంశాలకు సంబంధించి ఈ కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రతి విభాగానికీ
వేర్వేరుగా కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రతినిధుల కోసం మూడు భోజనశాలలు
ఏర్పాటు చేశారు. మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు 1975 ఏప్రిల్ 12 నుంచి 18 వరకూ హైదరాబాద్లో.. రెండో మహాసభలు 1981 ఏప్రిల్ 14 నుంచి 18 వరకూ మలేసియా రాజధాని కౌలాలంపూర్లో.. మూడో ప్రపంచ తెలుగు మహాసభలు 1990 డిసెంబరు 10 నుంచి 13 వరకూ మారిషస్లో జరిగాయి. నాలుగో మహాసభలు తిరుపతిలో నేటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి.
మహాసభలను
పురస్కరించుకొని తిరుపతిని వివిధ కళాకృతులతో అత్యంత సుందరంగా
తీర్చిదిద్దారు.. తిరునగరిలో ప్రధాన వీధులన్నీ విద్యుద్దీపాలతో
దేదీప్యమానంగా అలంకరించారు. సభా ప్రాంగణంగా ఎంపిక చేసిన పశువైద్య
కళాశాలలోని ప్రధాన రహదారులన్నింటినీ కొత్తగా నిర్మించారు. సభా ప్రాంగణానికి
దారి తీసే అన్ని ప్రధాన రహదారుల్లో నాలుగో ప్రపంచ తెలుగు మహాసభల వైభవాన్ని
తెలిపేలా భారీ స్వాగత తోరణాలు, సూచికలు ఏర్పాటు చేసి వాటినీ విద్యుద్దీపాలతో అలంకరించారు. ఆహ్వానితులకూ, ప్రతినిధులకూ 100 ఉచిత ప్రయాణ బస్సులను ఏర్పాటు చేశారు. వీటిని బస్టాండు, రైల్వేస్టేషన్ తదితర ప్రాంతాలతోపాటు రేణిగుంట, చంద్రగిరి నుంచి ఈ బస్సులు మూడు రోజుల పాటూ నడిచే విధంగా చర్యలు తీసుకున్నారు. మహాసభల ప్రధాన వేదికను కమలాకృతిలో తయారు చేశారు. ఐదు ఉపవేదికలు కూడా ఏర్పాటు చేశారు. మొదటి వేదిక (చర్చావేదిక)పైన.. 27న ఇతర దేశాల్లో తెలుగువారు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించనున్నారు. 28న సాంకేతిక సమస్యలపైన, 29న ఆధునిక సాహిత్యంలో అద్భుత ఘట్టాలపైనా చర్చ జరుగనుంది. రెండోది అధికార భాషావేదిక కాగా.. మూడోది సాహిత్య వేదిక. నాలుగో వేదికపై చరిత్ర, లలిత కళల గురించి చర్చిస్తారు. ఐదో వేదిక మీద ప్రగతి రంగంపై సమీక్షలుంటాయి.
అపూర్వమైన సంగీత, నృత్య ప్రదర్శనలు
రావు బాలసరస్వతి, పి.సుశీల, ఎస్ జానకిల సుస్వరాల ప్రార్థనా గీతంతో సభలు ప్రారంభమౌతాయి. అలాగే ఎన్.గోపి ద్వారా ఆధునిక కవి సమ్మేళనం, శోభానాయుడు, రాధారెడ్డి కూచిపూడి నృత్యరూపకం, ఎస్పి
బాలు బృందం సినీ సంగీత విభావరి.. గుమ్మడి గోపాలకృష్ణ బృందం కురుక్షేత్రం
పద్యనాటకం.. ఎల్లా వెంకటేశ్వరరావు మృదంగ విన్యాసం... నేరెళ్ల వేణుమాధవ్
ధ్వన్యనుకరణ... ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు. నగరంలోని రెండు థియేటర్లలో
అలనాటి తెలుగు చలన చిత్రాలు, మహతి సభావేదికపై సురభి నాటకాలు ప్రదర్శిస్తారు.
భాషాభివృద్ధికి బీజం పడేనా
ఇలా
అనేక కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ఈ తెలుగు సభల వల్ల
భాషాభివృద్ధికి బీజం పడేనా అని సర్వత్రా చర్చ సాగుతోంది. ఎన్నో శతాబ్దాల
చరిత్ర కలిగిన మన తెలుగుకు ప్రపంచీకరణ తెగులు పట్టుకుని పీడిస్తోంది.
ప్రభుత్వ విధానాల కారణంగానే ఆ దుస్థితి వస్తోందని భాషావేత్తలు ఆవేదన
వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేటు కంపెనీలు తమ వస్తువులను అమ్ముకునేందుకు
ఆంగ్లభాషను అత్యంత సులభంగా జనంలోకి తీసుకెళుతున్నారని అందుకే తెలుగుకు
ముప్పు వస్తోందని అంటున్నారు.
ప్రభుత్వం చెబుతున్న మహాసభల ఆశయాలివీ..
1.వైభవోపేతమైన మన తెలుగు భాష, సంస్కృతులపై నేటి బాలలకూ, యువతరానికీ ఆసక్తినీ, అభినివేశాన్నీ కల్పించేలా కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయడం, భావి తరాలకు తెలుగు సంస్కృతిని సమగ్రంగా అందించేలా కృషి చేయడం.
2. ప్రపంచీకరణ నేపథ్యంలో విదేశాల్లో, మన దేశంలోని ఇతర రాష్ట్రాల్లో నేల నాలుగు చెరగులా ఉన్న తెలుగువారిలో భావ సమైక్యాన్ని కలిగించేలా, వారందరినీ ఒక వేదికపై చేర్చి తెలుగు భాషా సంస్కృతులు ఎదుర్కొంటున్న సాధక బాధకాలను చర్చించి పరిష్కారాలు కనుగొనడం.
3. తెలుగు భాషను ప్రముఖ ప్రపంచ భాషలతో సరితూగేలా అంతర్జాలం (ఇంటర్నెట్)లొ ఉపయోగించేలా అన్ని చర్యలూ చేపట్టడం.
4. తెలుగు వారికి శతాధిక జానపద, సంప్రదాయ, కళారూపాలున్నాయి. వాటన్నిటి పరిరక్షణ, ప్రదర్శనలకు అవకాశం కల్పించి, అవి ప్రచారం పొందేలా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడం.
5. వేల ఏళ్ల చరిత్రగల తెలుగుజాతిపై గతంలో జరిగిన పరిశోధనలు ఒకచోట చేర్చి, పరిశీలించి, ఇంకా పరిశోధించాల్సిన అంశాలను గుర్తించి.. పరిశోధకులను ప్రోత్సహించడం, తెలుగు జాతి ప్రాచీనతను, ప్రశస్తులను వెలుగులోకి తేవడం.
6. తెలుగు జాతి సాహిత్య, సాంస్కృతిక చరిత్రపై సమగ్రమైన గ్రంథాలను ప్రచురించడం, తెలుగు భాషా నిఘంటువులను పరిపుష్టం చేయడం, నూతన పారిభాషిక పదాలను తయారు చేయడం.
7. తెలుగు భాషను అభ్యసించేవారికి ఆకర్షణీయమైన పాఠ్యగ్రంథాలు, బోధనోపకరణాలు, సరళమైన సులభశైలిలో తయారుచేసి వినియోగించేలా చర్యలు తీసుకోవడం.
8. తెలుగునేలపైగల చారిత్రక, ఆధ్యాత్మిక స్థలాలకు, పర్యాటక కేంద్రాలకూ తగిన ప్రాచుర్యం కల్పించడం.
No comments:
Post a Comment